6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఈ నెల 6 నుంచి విజయవాడ రైట్ సంస్థ వారు భూ సర్వేలు (సాయిల్ టెస్ట్) చేస్తారని, అలాగే ఎన్హెచ్–16 రోడ్డుకు ఎంత దూరంగా ఉందో ఆర్అండ్బీ శాఖ కూడా సర్వే చేస్తారని కార్గో ఎయిర్ పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన శుక్రవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు బాధిత రైతులకు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఒక ఎకరాకు 20 సెంట్లు భూమి ఇస్తారని, ప్రతి కుటుంబంలోని చదువుకున్న యువతకు వారి క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగ కల్పన జరుగుతుందని, లేదంటే కుటుంబానికి ప్యాకేజీ రూపంలో చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ మిస్క శ్రీకాంత్, డీటీ వై.రామకృష్ణ, ఎంఈఓ లక్ష్మణరావు, మండల సర్వేయర్ బాబురావు అధికారులు పాల్గొన్నారు.
సైనికుడికి ఘన స్వాగతం
రణస్థలం: భారత సైన్యంలో ముప్పై ఏళ్లు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సుబేదార్ ఆళ్ల అప్పన్న రెడ్డికి స్వగ్రామం నారువ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామ యువత సుమారు వంద బైక్లు, పదుల సంఖ్యలో కార్లతో పైడిభీమవరం నుంచి నారువ గ్రామం వరకు భారీ ఊరేగింపుగా జాతీయ జెండాలు చేతబూని జై భారత్, జై సైనికా నినాదాలతో తీసుకువచ్చారు. మహిళలందరూ హారతులు పట్టి స్వాగతం పలికారు. 1995 డిసెంబర్ 30న సైనికుడిగా విధుల్లో చేరిన అప్పన్న, 2025 డిసెంబర్ 31 ఉద్యోగ విరమణ పొందారు.
4న క్రికెట్ నెట్స్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో క్రికెట్ అబివృద్ధి కోసం సహకరించాలని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ విన్నవించారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను అతని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్ను ఈ నెల 4న ఎమ్మెల్యే, అధికారులు, జిల్లా క్రికెట్ సంఘం ముఖ్య ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇలియాస్ చెప్పారు.
ఎరువుల కొరత ఉండకూడదు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల కొరత ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ శాఖ జేడీ త్రినాథ స్వా మి, ఇతర అధికారులకు సూచించారు. ఆయన శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ సహాయకులకు దిశానిర్దేశం చేశారు. రైల్వే గేట్ల తొలగింపునకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. రైల్వే బోర్డు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు
6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు


