
16 మంది వైద్య సిబ్బందికి నోటీసులు
నరసన్నపేట: విధులకు ఆలస్యంగా వస్తుండటంపై నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో 16 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో పదిరోజులకు మించి ఆలస్యంగా ఎఫ్ఆర్ఎస్ నమోదైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారని, వారి ఆదేశాల మేరకు నలుగురు వైద్యులతో పాటు మరో 12 మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారం వారి నుంచి వివరణ తీసుకున్నామని అన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే అధికారుల ఆదేశాల మేరకు ఆలస్యమైన రోజు లను సెలవు దినాలుగా మార్చుతామని శ్రీనుబాబు తెలిపారు.
సాగునీటి సమస్యలు పరిష్కరించాలి
ఎచ్చెర్ల క్యాంపస్: సాగునీటి సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు ముర్రాపు సూర్యనారాయణ అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీటి కాలువలు, ప్రాజెక్టుల సందర్శనకు పూడివలస కూడలిలో జీపు యాత్రను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కుడి కాలువ కింద గత ఖరీఫ్లో పంటలు రైతులు కోల్పోయారని, ఈ ఏడాదైనా మరమ్మతులు నిర్వహించి సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు కింద సైతం సాగునీటి కష్టాలు ఉన్నాయని తెలిపారు. వంశధార, నాగావళి నధుల ఆధారంగా ఉన్న ప్రా జెక్టుల మరమ్మతులు నిర్వహించాలని చెప్పా రు. తక్కువ కేటాయింపులు రైతులకు శాపంగా మారుతున్నాయని అన్నారు. సాగునీటి సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు 7వ తేదీ ధర్నా చేస్తామన్నారు. రైతు సంఘం ప్రతినిధులు పొందూరు చంద్రరావు, కె. మోహనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ కొత్తకోట అప్పారావు, వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, భవిరి కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ జరుగుళ్ల కృష్ణారావు, కొత్తకోట అచ్యుతరావు పాల్గొన్నారు.