
● తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం
ఎల్.ఎన్.పేట: మండే వేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందివ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. మండలంలోని దబ్బపాడు గ్రామంలో మహిళలతో కలిసి తాగునీటి కోసం కుళాయిల వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.62 కోట్లు ఖర్చుతో 360 పనులు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే పాతపట్నం మండలంలో రూ.15.50 కోట్లు ఖర్చుతో 73 పనులు, మెళియాపుట్టిలో రూ.16 కోట్లు ఖర్చుతో 100 పనులు, ఎల్.ఎన్.పేట మండలంలో రూ.8కోట్లు ఖర్చుతో 46 పనులు, కొత్తూరు మండలంలో రూ.16.50 కోట్లు ఖర్చుతో 88 పనులు, హిరమండలం మండలంలో రూ.7కోట్లు ఖర్చుతో 54 పనులు మంజూరు చేశామన్నారు. వీటిలో 88 శాతానికి మించి పనులు పూర్తయ్యాయన్నారు. 1600 ఇళ్ల ముంగిటకే కుళాయిలు ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పాలన లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇంటి వద్దకు తాగునీరు అందివ్వలేని దుస్థితి ఏర్పడింది ఆరోపించారు. దబ్బపాడు గ్రా మంలో గత కొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాతపట్నం ఎమ్మెల్యే స్పందించక పోవటం బాధాకరమన్నారు. ఆమెతో పా టు ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి రామారావు, వైఎస్సార్ సీపీ మండల ప్రెసిడెంట్ పెనుమజ్జి విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ శిమ్మ సాంబశివరావు, దబ్బపాడు సర్పంచ్ ముద్దాడ మోహిని, ఎంపీటీసీ పల్లి జయలక్ష్మి, పార్టీ నాయకులు కొల్ల కృష్ణ, ఈగల చిన్నారావు, గేదెల శ్రీనివాసరావు, ఎర్ర జనార్థన, కొల్ల లక్ష్మునాయుడు, పల్లి సంజీవ్, ముద్దాడ లక్ష్మణరావు, తలసముద్రం శోభన్బాబు పాల్గొన్నారు.
గ్రామస్తులతో కలిసి ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి