చిలమత్తూరు: వాణిప్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. వ్యాపారుల స్వార్థం వెరసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జీఎస్టీ చెల్లించకుండా వస్తువులు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. హిందూపురంలో నకిలీ సిగరెట్లు, పాన్మసాలా, నాణ్యత లేని వస్తువులు, రైతులు వినియోగించే పైపులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు బిల్లులు లేకుండానే విక్రయించేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హిందూపురంతో పాటు నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాలకు ఈ వస్తువులు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు, వంద శాతం ఆన్లైన్ జీఎస్టీ బిల్లింగ్ అంటూ ప్రచారం చేస్తున్నా ఈ ప్రాంతంలో అలాంటివి కనిపించడం లేదు. కోట్లాది రూపాయల వ్యాపారం జీఎస్టీ లేకుండానే సాగుతోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల ముసుగులో కొందరు బడా వ్యాపారులు జీఎస్టీ ఎగవేస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపార లావాదేవీలు జీఎస్టీ పోర్టల్ పరిధిలోనే జరగాలి. లోపాలు ఉంటే నోటీసులు ఇవ్వాలి. కానీ ఆ దిశగా మాత్రం పనిచేయడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
గుడారంలో బేరాలు?
చిలమత్తూరు మండలం 44 వ నంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్పోస్ట్లో ఎకై ్సజ్శాఖ ఏర్పాటు చేసుకున్న చెక్పాయింట్ వద్ద తరచూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల తనిఖీల్లో భాగంగా బాగేపల్లి వైపు నుంచి వచ్చిన ఓ వాహనాన్ని, అందులోని వస్తువులను తనిఖీ చేయగా.. జీఎస్టీ బిల్లులు లేవని తేలింది. దీంతో కేసు పెడతామని బెదిరించి.. చివరకు అక్కడే ఉన్న గుడారంలోకి వెళ్లి రూ.5 వేలు తీసుకొని వారిని వదిలేశారు. సీటీఓ కారులోనే కూర్చొని రసీదులు తనిఖీ చేస్తుండగా... మరో అధికారి గుడారంలో వాహనదారులతో రహస్య మంతనాలు జరిపి నగదు తీసుకోవడం సీటీఓ అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. హిందూపురం వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తే ఓ అధికారి ఈ అవినీతి అక్రమాలకు కేరాఫ్గా నిలిచారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
వాణిజ్య పన్నుల అధికారుల సహకారం
బిల్లులు లేకుండానే వస్తువుల దిగుమతి
యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్న వైనం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి


