ధర్మవరం అర్బన్: ‘‘వైద్యశాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలి. అంతవరకూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి. విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియాతోపాటు కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి’’ అని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టిన కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలు చేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన వైద్య సెలవులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు హెల్త్కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. నిరసనలో కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగులు వెంకట రామంజనేయులు, పద్మ, మహబూబ్జాన్, అరుణ, కమలమ్మ, లూథియా, మాధవీలత, లక్ష్మీనరసమ్మ, సంధ్య, జయమ్మ, అమిద, అశ్విని, లలిత తదితరులు పాల్గొన్నారు.


