ఉల్లికల్లులో ఆగని ఇసుక తరలింపు | - | Sakshi
Sakshi News home page

ఉల్లికల్లులో ఆగని ఇసుక తరలింపు

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

శింగనమల: ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుక అక్రమ తరలింపు నిరాటంకంగా సాగుతోంది. పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు దాడులు చేసినా రాజకీయ నాయకుల అండదండలతో వెనక్కు తగ్గడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అక్రమార్జనే ధ్యేయంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పెన్నానదిలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో ఒక చోటకు డంప్‌ చేసుకుని, అక్కడి నుంచి రాత్రిపూట టిప్పర్లతో తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఇసుకను అమ్ముకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

సీజ్‌ చేసిన ఇసుకనూ వదల్లేదు

ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గత నెల 18న దాడులు చేసి, ఇసుక డంప్‌లను గుర్తించారు. దాదాపు 300 టన్నుల ఇసుక ఉందని లెక్క కట్టారు. కొద్దిరోజుల తర్వాత అక్రమార్కులు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఈసారి అక్రమ ఇసుక తవ్వకంతో పాటు అధికారులు సీజ్‌ చేసిన ఇసుకనూ రాత్రికి రాత్రే తరలించారు. సీజ్‌ చేసిన ఇసుక ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తే భూగర్భజలాలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement