బత్తలపల్లి: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన వెంకటరమణ, అతని తల్లి లక్ష్మీనారాయణమ్మ (60) ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళుతున్నారు. మార్గమధ్యంలో మండల పరిధిలోని పోట్లమర్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, వెంకటరమణ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
● బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు వెళ్లే టిప్పర్ల వేగానికి అంతేలేకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇసుక, బంకమట్టి, కంకర లోడుతో వెళ్లే టిప్పర్లకు స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ఏమాత్రమూ అడ్డూఅదుపు ఉండదన్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరొకరికి తీవ్రగాయాలు


