పుట్టపర్తి: చిత్రావతి నది కళ తప్పింది. గతంలో నదికి అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించి నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించారు. ప్రస్తుతం చెక్ డ్యామ్లో నీళ్లులేక ఎండిపోవడంతో కళావిహీనంగా మారింది. గత వైఎస్సాసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు చెక్ డ్యామ్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో చిత్రావతిని సందర్శించేవారు. వేసవి కాలంలోనూ బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపేవారు. ప్రస్తుతం పుట్టపర్తికి వచ్చే పర్యాటకులు ఇటు వైపు కూడా చూడని పరిస్థితి దాపురించింది.
కూత వేటు దూరంలోనే జలాలు..
హంద్రీ–నీవా కాలువ ద్వారా పుట్టపర్తికి కూత వేటు దూరంలోనే కృష్ణా జలాలు వెళ్తున్నాయి. పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి చెక్ డ్యామ్ను నింపే అవకాశం ఉంది. ఇందుకు వ్యయం కూడా చాలా తక్కువ అవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో చిత్రావతి వెలవెలపోతోంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై పుట్టపర్తివాసులు మండిపడుతున్నారు.
తాగునీటికీ కష్టాలే..
చిత్రావతి నదిలో నీళ్లు లేకపోవటంతో పుట్టపర్తివాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పుట్టపర్తిలో ఏ ఒక్క వార్డులో కూడా నీటి సమస్య తలెత్తలేదు. ప్రస్తుతం చెక్ డ్యామ్ ఎండిపోవటంతో బోర్లలో నీళ్లు తగ్గుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్యే స్పందించాలి
పుట్టపర్తికే తలమానికంగా ఉన్న చిత్రావతి చెక్ డ్యామ్ నీళ్లు లేక ఎండిపోయింది. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తక్షణమే స్పందించి లిఫ్టింగ్ ద్వారా కృష్ణా జలాలతో నింపేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సుందరీకరణ వృథా కావటంతో పాటు పర్యాటకులు దూరమవుతారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
– కవిత, పుట్టపర్తి
జలాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొంది. అయినా కృష్ణా జలాలను వినియోగించుకోకుండా కుప్పానికి తీసుకుపోవటం అన్యాయం. చిత్రావతి నది ఎండి పోవటంతో కళావిహీనంగా కనిపిస్తోంది. తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముంది. అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే కృష్ణా జలాలతో చెక్ డ్యామ్ను నింపాలి.
– లక్ష్మిదేవి, పుట్టపర్తి
కళ తప్పిన నది
కూత వేటు దూరంలోనే
కృష్ణా జలాలు పోతున్నా దుస్థితి
గతంలో ఆహ్లాదం పంచిన విషయాన్ని
గుర్తు చేసుకుని ప్రజల ఆవేదన


