పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఉదయం దివ్యాంగ విద్యార్థులతో ఉపాధ్యాయులు పనులు చేయించారు. చూపు, మాట, వినికిడి తదితర లోపాలతో బాధపడుతున్న విద్యార్థులతో ప్రాంగణంలో సున్నం వేయించారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి
అంధ విద్యార్థులన్న కనీస కనికరం లేకుండా వెట్టిచాకిరీ పనులు చేయించారని, వెంటనే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షకుమార్ డిమాండ్ చేశారు. ప్రాంగణంలోని గోడలకు, పరిసరాలకు విద్యార్థులచే సున్నం వేసే పనులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈమేరకు పాఠశాలలో విద్యార్థులతో కలిసి జరిగిన ఉదంతంపై మంగళవారం సాయంత్రం చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్ర పెరిగిందన్నారు. కనీస కనికరం లేకుండా దివ్యాంగ విద్యార్థులతో పనులు చేయించడం వెట్టి చాకిరీ కాదా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిల్లలే ముందుకొచ్చి పనులు చేశారు
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను పురస్కరించకుని పిల్లలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా పనులు చేయాలని భావించారని, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని ప్రిన్సిపాల్ రాజేశ్వరి తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలో
ఉపాధ్యాయుల నిర్వాకం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న
విద్యార్థి సంఘాలు


