పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పెద్దిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన మేరకు...పెద్దిరెడ్డిపల్లికి చెందిన నారాయణస్వామి కుమారుడు ఆదినారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి గత సోమవారం కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న వారు తలుపులు, లోపలి బీరువా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని 250 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రవికుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
భార్యతో గొడవ పడి.. రైల్వే ట్రాక్పై పడుకుని
● యువకుడిని కాపాడిన పోలీసులు
కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): భార్యతో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించిన ఒక యువకుడిని చెన్నేకొత్తపల్లి పోలీసులు కాపాడారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లికి చెందిన గణేష్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తి– ధర్మవరం మార్గంలో బసంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై పడుకున్నాడు. సెల్ఫీ తీసుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఘటనా స్థలాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో అక్కడికి చేరుకున్నారు. యువకుడికి ఏఎస్ఐ వేణుగోపాల్ సర్ది చెప్పి ట్రాక్పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. వివాహితుడైన గణేష్ తన భార్యతో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.
మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తికి జైలు
గోరంట్ల: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో మంగళవారం గోరంట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తిని అరెస్టు చేశారు. నిందితుడిని పెనుకొండ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ అనుపమ నిందితుడికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమాన విధించినట్లు సీఐ శేఖర్ తెలిపారు.


