కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐలు హరినాథ్, నీలకంఠేశ్వర్ వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మారెంపల్లి కాలనీకి చెందిన బోయ నరసింహ, బోయ మధుసూదన్, ఒంటిమిద్దికి చెందిన పిట్టి తిప్పేస్వామి, పార్వతీనగర్కు చెందిన బలిజ అచ్చయ్యలు బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టారు. మారెంపల్లి, పార్వతీ నగర్, ఒంటిమిద్దిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ చొరబడి బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురూ స్థానిక అక్కమ్మ గార్ల బస్ స్టాప్ వద్ద ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నెక్లెస్, గొలుసు, ఉంగరాలు, చెవి కమ్మలు, చైన్తో పాటు 129.6 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసకున్నట్లు సీఐలు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.


