పుట్టపర్తి టౌన్: పరాభవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జిల్లా యంత్రాంగం ఉగాది వేడుకను సందడిగా నిర్వహించింది. గురువారం ఉదయం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ప్రాచీన కళలు, సాహిత్యం, సంప్రదాయాల మేలు కలయికగా ఉగాది వేడుకలు నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖామంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకిత సురానాతో పాటు జిల్లా అధికారులు హాజరయ్యారు. అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా సంప్రదాయ పంచెకట్టుతో హాజరై ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్నారు. మంత్రి సవిత, ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. జాబిలి జయచంద్ర, వల్లం రమేష్బాబు, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, డాక్టర్ శివన్న, శోభారాణి, మాణిక్యం ఇషాక్, ముద్ద రంగప్ప కొండసాని రజిత తమ కవితలతో అలరించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కవులు, రచయితలను సత్కరించారు. నలుగురు అర్చకులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పంచెకట్టుతో అలరించిన కలెక్టర్, జేసీ, ఎస్పీ
ఉట్టిపడిన తెలుగు సంస్కృతి
అలరించిన కవి సమ్మేళనం


