ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి చెంత గురువారం ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరాన్ని మామిడి తోరణాలు, వేప చిగుర్లు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభించగా.. డాక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాంగ శ్రవణం గావించారు. పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వేదాంతం రాజగోపాల చక్రవర్తిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సభ్యుడు చక్రవర్తి ఘనంగా సత్కరించారు. అనంతరం సంగీత కచేరీతో సత్యసాయి యూత్ సభ్యులు అలరించారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన బృందం సంగీత కచేరీ ఆకట్టుకుంది.


