సాక్షి, పుట్టపర్తి: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకోవాలన్నారు. పరీక్షలు లేనిరోజుల్లో మాత్రం ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం 7:45లోపు ఇన్–టైమ్, మధ్యాహ్నం 12:30 తర్వాత అవుట్–టైమ్ నమోదు చేయాలని డైరెక్టర్ సూచించారు. ఒంటిపూట బడులు అమలులో ఉన్న సమయంలో హాఫ్ డే క్యాజువల్ లీవ్ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇక పదో తరగతి పరీక్షల డ్యూటీకి వెళ్లే టీచర్లు అటెండెన్స్ యాప్లో ‘పదో తరగతి డ్యూటీ’గా నమోదు చేయాలని, పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు.
ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు


