చెన్నేకొత్తపల్లి: ప్రతి మహిళా సమాజంలో సురక్షితంగా స్వశక్తితో ఎదగాలని ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకితా సురానా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామద్దలలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిఽఽథులుగా ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకితా సురానా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోలీసుశాఖ తరఫున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేర్చాలన్నారు. మహిళలు భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలు ఏ సమస్య ఉన్నా పోలీసులతో స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పించామన్నారు. ఇటీవల సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు అధికమయ్యాయని, అందువల్ల ప్రతి మహిళ తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరిస్థితులను వివరించి వాటిని ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలన్నారు. అలాగే అత్యవసరంలో పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం న్యామద్దెలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన మహిళలకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో రామగిరి సీఐ శ్రీధర్, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యారు.
మహిళా భద్రతే పోలీసుల లక్ష్యం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ


