పచ్చపాతం తగదు
● సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ఆవేదన
పెనుకొండ రూరల్: బిల్లుల మంజూరులో అధికారులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించడం తగదని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి తమకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ సొంత డబ్బు వెచ్చించి, అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించామన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో బిల్లులు ఇవ్వకపోవడంతో కష్టాల్లో కూరుకుపోయామని వాపోయారు.


