అ‘విశ్రాంత’ పోరాటం
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్లో దాచుకున్న డబ్బులు.. ఉద్యోగ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చివరకు గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్ (జీఎల్ఐ) డబ్బులు కూడా అందక అవస్థలు పడుతున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల వ్యవధిలోనే తాము దారుణంగా మోసపోయామని పెన్షనర్లు వాపోతున్నారు.
అనంతపురం కల్చరల్: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విషయంలో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆచరణను పూర్తిగా విస్మరించారు. 30 ఏళ్ల పాటు తాము దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫలితంగా ఒక రిటైర్డు ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తల కిందులవుతోంది. ఉద్యోగ విరమణ పొందిన మూడు నెలల్లోపు పెన్షనరీ బెనిఫిట్స్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఎప్పుడో ఒకసారి వాటిని జమ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన పలువురు... బెనిఫిట్స్ అందకనే చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక వైద్య సేవలను ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేయడంతో తాము పొందిన వైద్య సేవలకు ఇప్పటి వరకూ మెడికల్ రీయింబర్స్మెంట్ జమ కావడం లేదు. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా కొత్త పంథాను ఎంచుకున్న ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో ఆడుకుంటోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ తాము చూడలేదని పెన్షనర్లు అంటున్నారు.
కష్టాలు పంచుకునేలా...
కష్టాలు సుఖాలు, ఇబ్బందులు సౌకర్యాలు, మరెన్నో ఎత్తుపల్లాలను పంచుకునేలా పెన్షనర్ల దినోత్సవం రానే వచ్చింది. ఏటా డిసెంబరు 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లలిత కళాపరిషత్తు, ఉపాధ్యాయభవన్తో పాటు పెన్షనర్ల సంఘాలలో వేడకలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లను సన్మానించనున్నారు. అలాగే లలితకళాపరిషత్లో జరిగే కార్యక్రమంలోనూ తమ సమస్యల వాణిని వినిపించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తరలిరానున్నారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయస్సు దాటిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ తెలిపారు.
సందర్భం ః నేడు పెన్షనర్ల దినోత్సవం
చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై పెన్షనర్ల అసంతృప్తి
రిటైర్డ్ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు
ఆర్థిక ప్రయోజనాలు అందక అష్టకష్టాలు
ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం
పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించకపోవడం నిరంకుశ ధోరణికి నిదర్శనం. ఇప్పటి వరకూ డీఆర్, 11వ పీఆర్సీ బకాయిలు విడుదల కాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల కొంతమంది చనిపోయారు కూడా. వారికేమి న్యాయం చేసినట్లో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ఇక వైద్య సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలా అయితే ఉద్యమ బాట తప్పదు.
– శీలా జయరామప్ప, ప్రధానకార్యదర్శి పెన్షనర్ల సంఘం
అ‘విశ్రాంత’ పోరాటం


