
ఆదర్శప్రాయుడు ఆంధ్ర కేసరి
● ప్రకాశం పంతులుకు
నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శ ప్రాయుడని, ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని శనివారం కలెక్టరేట్లో, ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ చేతన్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు గుర్తు చేశారు. స్వాతంత్య్రోద్యమంలో సైమన్ కమిషన్కు గుండెలు చూపిన ధీశాలి ఆంధ్రకేసరి అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి తెచ్చారన్నారు. అంతకుముందు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రత్న... ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
‘సాక్షి’ విలేకరికి బెయిల్
కదిరి: టీడీపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసుతో జైలు కెళ్లిన తలుపుల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డితో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బారెడ్డికి శనివారం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే... తలుపుల మండలం రాజనోళ్లపల్లి సర్పంచ్ సుగుణమ్మ (వైఎస్సార్సీపీ మద్దతుదారు) ఈ ఏడాది జూలై 27న మధ్యాహ్నం తన ఇంట్లో నిద్రిస్తుండగా గ్రామానికి చెందిన నవీన్ (టీడీపీ ) ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు అపహరించుకుని వెళ్లారు. తర్వాత గ్రామస్తులందరూ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీన్ని అవమానంగా భావించిన నవీన్ అదేరోజు ఇంటి పక్కనే చెట్టుకు ఉరివేసుకున్నారు. అయితే టీడీపీ నాయకులు దీన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. బాధితురాలు సుగుణమ్మతో పాటు విధి నిర్వహణలో భాగంగా వివరాలు సేకరించేందుకు వెళ్లిన తలుపుల మండల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డితో సహా మరో 8 మందిపై తప్పుడు కేసు పెట్టారు. దీంతో పోలీసులు రఘునాథరెడ్డిని గత నెల 28న అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తంకదిరి సబ్జైలుకు తరలించారు. ఈ కేసులోనే శనివారం రఘునాథరెడ్డితో పాటు మరో వ్యక్తికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొందరు హైకోర్టును ఆశ్రయించగా.. వారికీ బెయిల్ మంజూరైంది.
వైఎస్సార్సీపీ కార్యకర్త
రమేష్పై కేసు
పుట్టపర్తి: దివ్యాంగుల పింఛన్ల తొలగింపును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టిన బుక్కపట్నం మండలం నార్శింపల్లికి చెందిన పి.రమేష్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై బుక్కపట్నం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. బుక్కపట్నం టీడీపీ మండల కన్వీనర్ మల్లిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. కూటమి ప్రభుత్వం పలువురు దివ్యాంగుల పింఛన్లను తొలగించిందని రమేష్ పోస్టులు పెట్టారని... ఇందులో నిజం లేదని టీడీపీ నేత ఫిర్యాదు చేశారన్నారు.