
బలవంతపు భూసేకరణ ఆపాలి
పెనుకొండ: నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసెల్ కార్పొరేట్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణ ఆపాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. పెనుకొండలోని పౌరసరఫరాల హమాలీ యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించి, 80 శాతం ప్రజల ఆమోదం పొందిన తర్వాతనే భూసేకరణ చేయాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. అయితే చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతపు భూసేకరణ చేయడం దుర్మార్గమన్నారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కరేడు గ్రామ రైతులు, ప్రజలకు సంఘీభావంగా ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాలు సోమవారం చేపట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తూ అక్రమ అరెస్ట్లకు తెరలేపిందని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో వలసలు తప్పవని, రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఉండదని అన్నారు. జిల్లాలోనూ సోలార్, ఏపీఐఐసీ కోసం ఎన్పీకుంట, గోరంట్ల, హిందూపురం, మడకశిర, రొద్దం తదితర ప్రాంతాల్లో సుమారు 60 వేల ఎకరాలను బలవంతంగా సేకరించే చర్యలు మానకపోతే పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటేష్, నాయకులు నరసింహులు, లక్ష్మీనారాయణ, బాబా, సాంబ, ఉషమ్మ, నాగరాజు, బాబావలి, బావమ్మ, గంగాధర్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు