
బాలికలు.. క్రీడల్లో మెరికలు
అమరాపురం: హలుకూరు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో చదువుకుంటున్న పలువురు బాలికలు క్రీడల్లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా జూలై 28న అనంతపురం జిల్లా కేంద్రంలోని పీటీసీ క్రీడా మైదానంలో అండర్– 16, అండర్–18 బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో అంత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు తొమ్మిది మంది విద్యార్థులు షాట్పుట్, జావెలింగ్ త్రో, పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యారు. మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన బాలికలు గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రిన్సిపాల్ అపర్ణ, పీడీ రోజా, పీఈటీ భాగ్యమ్మ, ఉపాధ్యాయుల సహకారంతో క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. వీరి సాధన రోజూ వేకువజామునే ధ్యానంతో ప్రారంభమవుతుంది. 5.30 నుంచి 7 గంటల వరకు పీడీ, పీఈటీలు సంయుక్తంగా వివిధ ఆటల పోటీలు సాధన చేయిస్తున్నారు. అథ్లెటిక్స్ పోటీలైన పరుగు పందెం, 200 మీటర్లు, 400, 3000 మీటర్ల పరుగు పందెం, జావెలిన్ త్రో, షాట్పుట్, ఖోఖో, కబాడ్డీ, వాలీబాల్, తదితర పోటీలకు ఎంపిక చేసుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించే జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రుల నుంచి కూడా సహకారం, ప్రోత్సాహం ఉంటోంది.
ప్రతిభను గుర్తించి.. శిక్షణ ఇస్తున్నాం
మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభను గుర్తించి ఇష్టమైన క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నాం. పీఈటీ, ప్రిన్సిపాల్ సహకారం బాగుంది. తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. మా పాఠశాల విద్యార్థినులు జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణిస్తున్నారు.
–పీఈటీ భాగ్యమ్మ, పీడీ రోజా, గురుకుల పాఠశాల, అమరాపురం
ఆత్మవిశ్వాసంతో
ముందుకెళ్తున్నా
నేను ఇంటర్ జూనియర్ బైపీసీ చదువుతున్నా. నాకు క్రీడలు, అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నా. పరుగుపందెం పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నా.
– రష్మీబాయి, విద్యార్థి, గురుకులపాఠశాల
సాధనతోనే సాధ్యం
నిరంతరం సాధన చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మాది పేద కుటుంబం శెట్టూరు మండలం బోయబోరనపల్లి. నేను ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీ చదువుతున్నా. 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంతో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా. పీడీ, పీఈటీల ప్రోత్సాహం బాగుంది.
– వరలక్ష్మి, విద్యార్థి, గురుకుల పాఠశాల, అమరాపురం
సత్తా చాటుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినులు
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న
పీడీ, పీఈటీలు
డీఎస్పీ అవుతా
మాది పేద కుటుంబం. నేను అథ్లెటిక్స్ బాగా ఆడుతా. స్పోర్ట్స్ కోటా కింద డీఎస్పీ కావాలనుకుంటున్నా. తప్పకుండా సాధిస్తా. ప్రస్తుతం షాట్పుట్లో సాధన చేస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా.
–కోవెల, పదో తరగతి, గురుకుల పాఠశాల

బాలికలు.. క్రీడల్లో మెరికలు

బాలికలు.. క్రీడల్లో మెరికలు

బాలికలు.. క్రీడల్లో మెరికలు

బాలికలు.. క్రీడల్లో మెరికలు

బాలికలు.. క్రీడల్లో మెరికలు

బాలికలు.. క్రీడల్లో మెరికలు