
ఎడారి పంట అయిన ఖర్జూరం కరువు నేల ‘అనంత’లో సిరులు కురిపి
గార్లదిన్నె: జిల్లాలోని పలువురు రైతులు ఎప్పటికప్పుడు కొత్త తరహా పంటలు సాగు చేసి మంచి దిగుబడులతో దూసుకెళ్తున్నారు. అనంతపురం మండలం సిండికేట్నగర్కు చెందిన రైతు రమణారెడ్డి కూడా వినూత్న పంటల సాగుతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల్లోని తమ వ్యవసాయ భూముల్లో ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్ పంట పెట్టి సక్సెస్ అయిన ఈయన ఖర్జూర పంటను పెట్టారు. ఈయన 2019లో కన్యాకుమారి యాత్రకు వెళ్తూ తమిళనాడులో జాతీయ రహదారిపై ఖర్జూర పండ్లు అమ్మడం చూశారు. అక్కడ ఉన్న ఖర్జూర పండ్ల తోటలను గమనించి, ఈ ఎడారి పంట సాగు విధానం చూసి ఎలాగైనా మన నేలలో సాగు చేయాలని భావించారు. అలా అనుకున్నదే తడవు తమకు మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో ఉన్న ఆరు ఎకరాల విస్తీర్ణంలో టిష్యూ కల్చర్ విధానంలో ఖర్జూర పంట కూడా సాగు చేస్తున్నారు. అబూదాబి నుంచి బర్హీ ఎల్లో రకం మొక్క రూ.4500 చొప్పున 500 ఆడ, 50 మగ మొక్కలు కొనుగోలు చేశారు. ప్రతి 100 ఆడ మొక్కల్లో 10 మగ మొక్కలు ఉండేలా నాటారు. ఒక్కసారి మొక్క నాటితే 40 ఏళ్లపాటు పంట దిగుబడి వస్తుంది. సాధారణంగా ఫిబ్రవరిలో పూత దశ ఉంటుంది. పూత సమయంలో ఆడ, మగ మొక్కలు సంపర్కం చేస్తేనే ఖర్జూర పంట వస్తుంది. సంపర్కం జరగకపోతే ఈత కాయల తరహాలో మారిపోతాయి. సంపర్కం చేసే రోజు వర్షం వస్తే పంట దిగుబడి రాదు. అలాగే తోటలో మగ మొక్కలు పూత తక్కువ వస్తే, సంపర్కం కోసం మగ పూత కిలో రూ.12,500 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జూలై చివరిలో పంట కోత దశకు వస్తుంది.
ఏకరాకు రూ.7లక్షల దాకా పెట్టుబడి..
పంట సాగులో మొదటి నుంచి సేంద్రియ ఎరువులు, ఆవుపేడ, గంజు, కోడి, గొర్రెల పెంట వంటి హిట్ ఎరువులు, జీవామమృతం అధికంగా వాడాలి. ఎకరాకు రూ.7 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది. నీరు కూడా చాలా ఎక్కువ అవసరం. ఎకరాకు 100 మొక్కలు సాగు చేయవచ్చు. మూడు నుంచి నాలుగేళ్లకే దిగుబడి వస్తుంది. ఐదు సంవత్సరాల్లో ఒక చెట్టు వంద కేజీల ఖర్జూర కాయలు కాస్తుంది. ఒక ఎకరంలో 5 టన్నుల దిగుబడి వస్తుంది.
సేంద్రియ ఎరువులతో తెగుళ్లకు చెక్..
ఖర్జూర పంటలో రైనోబీటిల్, రెడ్విల్ వంటి తెగుళ్లు వస్తాయి. ఈ తెగుళ్లు సోకిన మొక్క కిందకు వాలిపోతుంది. సేంద్రియ ఎరువులు అధికంగా వాడి తెగుళ్లను నివారించవచ్చు. పంట సాగుకు చౌడు, నల్లరేగడి, ఇసుక లోమి నేలలు అనుకూలం.
డిమాండ్ ఎక్కువే..
ఖర్జూరకాయలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. విశాఖపట్నం, గుంటూరు, తణుకు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు తోట వద్దకే వచ్చి పసుపు పచ్చని ఖర్జూర కాయలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హోల్సేల్ కిలో రూ.120తో, టన్ను రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు రమణారెడ్డి 25 టన్నుల ఖర్జూర కాయలు విక్రయించారు. ఇంకా 10 టన్నులదాకా కాయలు చెట్ల మీద ఉన్నాయి.
జిల్లాలో విస్తరిస్తున్న సాగు
ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు దిగుబడులు
ఖర్జూరాలకు మార్కెట్లో మంచి డిమాండ్
ఆదర్శంగా నిలుస్తున్న రైతు రమణారెడ్డి

ఎడారి పంట అయిన ఖర్జూరం కరువు నేల ‘అనంత’లో సిరులు కురిపి