హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, ఎస్ఐ క్రిష్ణవేణి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైటీ చంద్రశేఖర్రెడ్డి, సాయినాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


