మనుబోలు: ‘విద్యార్థులకు పాడైపోయిన చిక్కీలు ఎందుకిస్తున్నారు?.. వీటిని తింటే వారి ఆరోగ్యం ఏమి కావాలి’ అంటూ టాస్క్ఫోర్స్ అధికారి గూడూరు డిప్యూటీ డీఈఓ సనత్కుమార్ బాలికల హైస్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను శుక్రవారం టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చిక్కీలు ఈ ఏడాది జూలైతో కాలపరిమితి తీరిపోయినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై మీకు అంత చిన్న చూపా అంటూ ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గడువు తేదీ దాటిపోయిన చిక్కీలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలైతే ఎవరిది బాధ్యతని నిలదీశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు.


