● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
నెల్లూరురూరల్: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. శుక్రవారం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీ లిమిటేషన్ జరిగితే దేశం ఆరు ముక్కలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉత్తర భారతదేశానికి 500 లోక్సభ స్థానాలు, దక్షిణ భారతదేశానికి 300 లోపు స్థానాలు కేటాయించేలా డీ లిమిటేషన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగంపై అవగాహన లేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కొరవడిందన్నారు. కార్పొరేట్లకు మాత్రం స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉందని విమర్శించారు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని కోరారు.


