● వైఎస్సార్సీపీలో కాకర్లవారిపాళేనికి చెందిన 70 కుటుంబాల చేరిక
● సాదరంగా ఆహ్వానించిన
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ దగా రాజకీయాలు, మోసాలను భరించలేకపోయిన మండలంలోని కాకర్లవారిపాళేనికి చెందిన 70 కుటుంబాలు టీడీపీని బుధవారం వీడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నేరెళ్ల నవీన్, దాసరి రమేష్, కుడుముల ఉపేంద్ర, నిక్కుదల శ్రీనివాసులు, నిక్కుదల నాగరాజు, ముక్కు వెంకటేశ్వర్లు, పేరం అనంత్, గుమ్మడి నాగేంద్ర, కుడుములు వెంకటసుబ్బయ్య, గుత్తికొండ రాధాకృష్ణయ్య, మాలికల చంద్రయ్య, పైనం శ్రీనివాసులు, జంగం శ్రీహరి, జంగం వెంకటసుబ్బయ్య తదితరులకు పార్టీ కండువాలను కాకాణి కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి.. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమన్నారు. కాకర్లవారిపాళెంలో ఏకంగా 70 కుటుంబాలు టీడీపీని వీడి తమ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న శ్రేణులు.. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలకు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుచేసుకొని.. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీని వీడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న తమ పార్టీకి మద్దతు పెరుగుతోందని, రానున్న రోజుల్లో టీడీపీ నుంచి తమ పార్టీలోకి చేరికలు మరింతగా ఉంటాయని చెప్పారు.


