నెల్లూరు(లీగల్): రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు న్యాయవాదులు రక్షకులుగా వ్యవహరిస్తున్నారని, వారికి భద్రత క ల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలులో ఉందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి ప్రణీత్రెడ్డి, లైబ్రరీ కార్యదర్శి నాగశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ వర్గీయుల ఘర్షణ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలో టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. స్థానికుల కథనం మేరకు.. వింజమూరు బీసీ కాలనీలో నివాసముంటున్న ఎంపీపీ వనిపెంట హైమావతి కారు డ్రైవర్ షేక్ బాషా గురువారం సాయంత్రం టీడీపీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డిని ఉద్దేశించి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నరసారెడ్డి రాత్రి పది గంటల సమయంలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు బాషాను స్టేషన్కు తీసుకొచ్చే ప్రయత్నంలో రాఘవేంద్ర సెల్ప్లాజా సమీపంలోని మెయిన్రోడ్డుపై కన్వీనర్ వర్గీయులు అతడితో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది బాషాపై చేయి చేసుకోవడంతో కిందపడిపోయాడు. దీని నుంచి అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని స్టేషన్కు తరలించి అనంతరం వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు పంపారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇరువురూ టీడీపీకి చెందినవారే కావడంతో స్థానిక నేతలు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.


