● కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల
సంక్షేమ సంఘం ధర్నా
నెల్లూరురూరల్: రేషన్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని వెంటనే సమీక్షించి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సెప్టెంబరు నెల నుంచి కార్డుదారులకు పంపిణీ చేసే 10 శాతం బ్రోకెన్ రైస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విధానంతో డీలర్లపై అదనపు పనిభారం పడటంతోపాటు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక మంది రేషన్ డీలర్లకు ఇప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో లేవని, దీంతో క్యూఆర్ కోడ్ స్కానింగ్కు అవసరమైన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుందన్నారు. మరోవైపు మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనే క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయకుండా రేషన్ షాపుల వద్ద మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అనవసరమైన బాధ్యతలు మోపుతున్నారని ఆరోపించారు. స్టాక్ పాయింట్లలో జరుగుతున్న తరుగుదల, ఇతర అవకతవకలకు డీలర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా మరింత భారం మోపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన రమేష్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లాభక్షు, మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


