● నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరురూరల్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పున్నారావు, కార్యదర్శి సత్తిరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి, 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. హయ్యర్ పెన్షన్ కోసం నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించలేని వారికి మరో అవకాశం కల్పించాలన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఏపీఎస్, సీపీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీసం రూ.9 వేలను డీఏతో కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల వేతనాల నుంచి ఈపీఎఫ్ చందాలను వసూలు చేసి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.


