● గొలగమూడిలో భక్తుల కోలాహలం
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వెంకటాచలం: 44వ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి ఆశీనులై గొలగమూడి వీధుల్లో విహరించారు. ముందుగా ఆశ్రమంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలతో శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపు కనులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు గొలగమూడికి తరలివచ్చారు. ఈ సేవకు నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు.
● ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన చంద్రప్రభ వాహనంపై వెంకయ్యస్వామిని ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలను ప్రదర్శించారు. ఈ సేవకు ఆల్తూరి గిరీష్రెడ్డి, లత దంపతులు, ఆల్తూరి మహేష్రెడ్డి, రాధిక దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
ఉత్సవాల్లో నేడు
గురువారం ఉదయం హనుమంత సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.


