
పెరోల్ రచ్చ.. అరుణ అరెస్ట్
● ఆమెతో పాటు మరో ముగ్గురూ..
● డైవర్షన్లో భాగంగా
పాత కేసులో అరెస్ట్ చేసిన వైనం
కోవూరు: రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కుదిపేస్తున్న నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ఈ కేసులో సంచలనానికి కేంద్రబిందువైన శ్రీకాంత్ స్నేహితురాలు నిడిగంటి అరుణ మంగళవారం టీడీపీ నేతల బాగోతాలన్ని బయటపెడతానంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరలైంది. ఇది జరిగిన 24 గంటలు గడవక ముందే అరుణను కట్టడి చేసేందుకు ఈ కేసుకు సంబంధించి కాకుండా ఎప్పటిదో వేరే కేసును తిరగదోడి బుధవారం అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. బిల్డర్ నుంచి బలవంతంగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించింటూ అరుణతో పాటు మరో ముగ్గుర్ని కోవూరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కేసు..
బిల్డర్ మునగ వెంకట మురళీకృష్ణమోహన్ 2010లో పెద్దపడుగుపాడులో సాయి ఎన్క్లేవ్ పేరుతో 15 ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మించారు. అందులో 14 ప్లాట్లు విక్రయించగా, 503 ఫ్లాట్ను తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2020 డిసెంబర్లో నిడిగుంట అరుణ ఆ ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. అనంతరం ఆ ఫ్లాట్ తన తండ్రి పేరిట రిజిస్టర్ చేసుకోవాలని 2022 అక్టోబర్లో ఒప్పందం చేసుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. మిగిలిన రూ.25 లక్షలు 2023 ఫిబ్రవరి నాటికి చెల్లిస్తానని అంగీకారం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోగా అద్దెను కూడా నిలిపివేసింది. ఈ వ్యవహారమై కోర్టులో కేసు కొనసాగుతుండగా అరుణ తన అనుచరులు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాతో కలిసి వెంకట మురళీకృష్ణమోహన్ను బెదిరించి పెళ్లకూరు కాలనీలోకి తీసుకెళ్లి తాను రూ.25 లక్షలు చెల్లించినట్లు పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై తరచూ ఫ్లాట్ రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెంచారు. మాట వినకపోతే ప్రాణాలతో ఉండవని హెచ్చరించారు.
పెరోల్ వ్యవహారాన్ని
పక్కదోవ పట్టించేందుకు..
అరుణ స్నేహితుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయడానికి అరుణపై ఉన్న ఈ కేసును బయటకు తోడారు. అరుణతోపాటు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సౌజన్య, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కోవూరు సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై రంగనాథ్గౌడ్ ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు అరుణ మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులలో అరుణతో పాటు వేణు, రాజా, అన్సర్, ముసబీర్, గణేష్, ఎలీషా ఉన్నారు. అయితే అస్సర్, ముసబీర్, గణేష్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని నెల్లూరు కోర్టులో హాజరుపర్చారు
ఒంగోలు జిల్లా జైలుకు..
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అతడి సన్నిహితురాలు అరుణను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. కావలి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు రాత్రి పది గంటలకు నెల్లూరు పోలీసులు తరలించారు.

పెరోల్ రచ్చ.. అరుణ అరెస్ట్