
దివ్యాంగ టీచర్లకు సదరం కష్టాలు
నెల్లూరు(అర్బన్): త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే కౌన్సెలింగ్లో దివ్యాంగులకు అదనపు మార్కులు వస్తాయి. అయితే వీరి సదరం సర్టిఫికెట్లను పెద్దాస్పత్రిలో మరో దఫా రీవెరిఫికేషన్ చేయించిన సందర్భంలో పలువురు దివ్యాంగ ఉపాధ్యాయులకు గతంలో ఉన్న వికలత్వ శాతాన్ని చాలా వరకు తగ్గించారు. ఒక ఉపాధ్యాయుడికి గతలో 85 శాతం సదరం సర్టిఫికెట్ ఇవ్వగా, దాన్ని ఇప్పుడు 60 శాతానికి తగ్గించారు. మరో ఉపాధ్యాయుడికి 50 శాతం సదరం సర్టిఫికెట్ ఉండగా ప్రస్తుతం 30 శాతానికి కుదించారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ కార్తీక్కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ అధికారులు ఆ ఉపాధ్యాయులను పెద్దాస్పత్రి వెళ్లాలని సూచించారు. దీంతో సోమవారం పెద్దాస్పత్రికి వచ్చి అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. దీంతో సూపరింటెండెంట్ మరోసారి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయించి పరిశీలన చేయిస్తానని తెలిపారు. అందుకు మంగళవారం రావాలని సూచించారు. దీంతో వెళ్లి పోయిన దివ్యాంగ ఉపాధ్యాయులు మంగళవారం పెద్దాస్పత్రికి వచ్చారు. అయితే సూపరింటెండెంట్ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకుండానే సెలవుపై వెళ్లిపోయారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ మస్తాన్బాషాకు ఉపాధ్యాయులను రమ్మన్న విషయం తెలియదు. ఇన్చార్జి సూపరింటెండెంట్కు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి పర్మిషన్ లేదు. దీంతో ఆయన కలెక్టర్తో మాట్లాడి వారి సూచనల ప్రకారం మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి పంపించారు. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలు పడి వచ్చిన దివ్యాంగ ఉపాధ్యాయులకు తిప్పలు తప్పలేదు.