
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
● రూ.ఏడు లక్షల విలువైన సొత్తు స్వాధీనం
ఆత్మకూరు: నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో వివరాలను డీఎస్పీ వేణుగోపాల్ శనివారం వెల్లడించారు. పట్టణంలోని బంగారు నగల దుకాణ యజమాని రమణమూర్తి గత నెల 31వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో షాపును మూసేందుకు ఉపక్రమించారు. ఈ తరుణంలో తన చేతిలోని నగల సంచిని పక్కన పెట్టి తలుపులేస్తుండగా, అక్కడే ఉన్న ఓ యువకుడు తస్కరించి అప్పటికే బైక్తో సిద్ధంగా వ్యక్తితో కలిసి ఉడాయించారు. దుకాణాదారుడు గమనించేలోపు వారు పరారయ్యారు. అక్కడే ఉన్న కొందరు యువకులు వారిని బైక్లపై వెంబడించినా ప్రయోజనం లభించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ గంగాధర్ ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలోని చర్చి సెంటర్కు చెందిన బొంతు మంగయ్య, పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన ఓటేరు సాయిని నిందితులుగా గుర్తించారు. బోయలచిరివెళ్ల వద్ద వీరు సంచరిస్తుండగా, అదుపులోకి తీసుకున్నారు. చిన్నపిల్లల కమ్మలు, బ్రాస్లెట్లు 50 గ్రాముల బంగారం.. 61 జతల వెండి గొలుసులు.. మొత్తం రూ.ఏడు లక్షలు విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలు జిలానీ, సాయిప్రసాద్, శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది గిరిధర్, చెన్నకేశవులు, శ్రీనివాసులురెడ్డి, విజయ్, సతీష్, షరీఫ్, అశోక్, అలీ, తదితరులను అభినందించారు. వీరికి రివార్డులను ఎస్పీ ద్వారా అందజేయనున్నామన్నారు.

చోరీ కేసులో నిందితుల అరెస్ట్