నెల్లూరు (స్టోన్హౌస్పేట): కశ్మీర్లో పర్యాటకులపై ముష్కరులు సాగించిన మారణకాండ పిరికి పంద చర్య అని ఎమ్మెల్సీ, నెల్లూరుసిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బుధవారం ఖండించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇదే అన్నారు.
టెర్రరిస్టుల ఉన్మాదం హేయం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కశ్మీర్లో టెర్రరిస్టులు సాగించిన ఉన్మాద చర్య అత్యంత హేయమని మాజీ ఎంపీ, నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ దాడిలో ఇద్దరు ఆంధ్రా వాసులు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
19 నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ లోపు సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంది. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వచ్చే నెల 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రీకౌంటింగ్కు సబ్జెక్ట్కు రూ.500, రీ వెరిఫికేషన్కు సబ్జెక్ట్కు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంది.
16 జెడ్పీ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యా జమాన్య పరిధిలో 16 పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ బుధవారం ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. 10,211 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే 7,414 మంది ఉత్తీర్ణులు కాగా 73.62 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. 595 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి పూజిత, 594 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన ఎండీ జువేది, 593 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచిన జి.జ్ఞాపిక, జి. భార్గవ్ను ప్రత్యేకంగా అభినందించారు. 100 మంది విద్యార్థులు 575 మార్కులకు పైగా సాధించారని, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించిన విజయదీపిక స్టడీ మెటీరియల్ మంచి ఫలితాలకు దోహదపడిందన్నారు.
పొగాకు గరిష్ట ధర రూ. 280
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 543 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 350 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 193 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి నివేశ్కుమార్పాండే మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.210 లభించగా, సగటున రూ. 252.29 ధర లభించిందన్నారు.