మూడు లక్షల ఎకరాలకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

మూడు లక్షల ఎకరాలకు సాగునీరు

Apr 18 2025 12:04 AM | Updated on Apr 18 2025 12:04 AM

మూడు లక్షల ఎకరాలకు సాగునీరు

మూడు లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు (పొగతోట): సోమశిల జలాశయంలో 56.268 టీఎంసీల నీటి లభ్యత ఉందని, రెండో పంటలో మూడు లక్షల ఎకరాలకు 41 టీఎంసీలను మే ఐదు నుంచి విడుదల చేసేలా సాగునీటి సలహా మండలిలో తీర్మానం చేశామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఐఏబీ సమావేశాన్ని కలెక్టర్‌ ఆనంద్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డెడ్‌ స్టోరేజ్‌, నీటి ఆవిరి, మంచినీటి అవసరాల కోసం 12.5 టీఎంసీలు అవసరమని, ఇవి పోనూ 43 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

తక్కువ నీటితో సాగుకు సన్నద్ధం కండి

రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటిని సాగుకు వినియోగించేలా రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లష్కర్లకు రూ.4.68 కోట్ల వేతన బకాయిలున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గత సీజన్‌కు సంబంధించి 1.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.190 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు.

పంట నష్టంపై అంచనాలు

వర్షాలు, గాలులకు పంట నష్టం సంభవించిందని, దీనిపై అంచనాలను రూపొందించి నివేదికలను అందజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతికి ఎప్పుడైనా నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం చైన్నెకు 15 టీఎంసీలను విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో తాగునీటి అవసరాలను గుర్తించి నీటి నిల్వలను పెంచాలని సూచించారు.

ప్రతిపాదనలు ఇలా..

పెన్నార్‌ డెల్టా ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు.. కనుపూరు కాలువ 25 వేలు.. సోమశిల ప్రాజెక్టు కాలువ కింద 1.44 లక్షల ఎకరాలు.. మొత్తం 3.69 లక్షల ఎకరాలకు 43.42 టీఎంసీల నీటి కేటాయింపునకు అధికారులు ప్రతిపాదించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు తదితరుల ఆమోదం మేరకు రెండో పంటలో సుమారు మూడు లక్షలకుపైగా ఎకరాలకు 41 టీఎంసీలను కేటాయించామని తెలిపారు.

కాలువల పనులకు రూ.18 కోట్లు

జిల్లాలో మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ కాలువ పనుల కోసం రూ.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలో రూ.38 కోట్ల నీటి పన్ను బకాయిలున్నాయని, వీటిని వసూలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో కాలువల మరమ్మతులకు వినియోగించొచ్చని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇరిగేషన్‌ అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల పనులను చేపట్టాలని సూచించారు.

గోశాలలో సహజ మరణాలు

తిరుమల గోశాలలో గోవుల మరణాలు సహజమైనవేనని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలు..

సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో పంటకు రైతులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేరని, సర్వేపల్లి కాలువకు కేటాయించిన నీటిని తగ్గించేలా.. అవసరమైన ప్రాంతాల్లో పంటల సాగుకు వినియోగించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

కనిగిరి రిజర్వాయర్‌, జాఫర్‌ సాహెబ్‌ కాలువ పూడికతీత పనులను చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు.

దగదర్తి మండలానికి సంబంధించిన డీఆర్‌ ఛానల్‌ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు సాగునీటిని విడుదల చేసే ముందే కాలువ పనులను జరపాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

గండిపాళెం ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధతో పాటు సోమశిల జలాలను ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ కోరారు. కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఆత్మకూరు ఆర్డీఓ పావని, ఇరిగేషన్‌ అధికారులు దేశ్‌నాయక్‌, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, ఏపీఎమ్మైడీపీ పీడీ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కల్యాణ్‌ చక్రవర్తి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండో పంటకు మే ఐదున విడుదల

41 టీఎంసీల కేటాయింపు

ఐఏబీ సమావేశంలో

మంత్రి రామనారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement