
యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు
ఆత్మకూరు: ఆత్మకూరు మేజర్ చెరువు నుంచి మట్టి తోలకాలు గురువారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే జేసీబీతో పదుల కొద్ది ట్రాక్టర్లతో ప్లాట్లు, పొలాలకు మట్టిని తరలిస్తున్నారు. చెరువు పైభాగంలోని జంగాలపల్లి, రావులకొల్లు, అల్లీపురం ప్రాంతాల్లో లోతుగా తవ్వకాలు చేపట్టారు. దీంతో చెరువులోని తుమ్మచెట్లు సైతం నేలవాలుతున్నాయి. మట్టి తరలింపులో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయమై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.