
ప్రజా చైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ
● జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి
నెల్లూరు(క్రైమ్): ప్రజా చైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వి.శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు రైల్వేఫీడర్స్ రోడ్డులోని జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం వారోత్సవాలను డీఎఫ్ఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ప్రమాదాలపై సమాచారం అందిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విధి నిర్వహణలో ఏ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినా జరిగే నష్టం స్వల్పంగా ఉంటుందని, తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ నష్టం జరుగుతుందన్న విషయాన్ని నిత్యం గమనంలో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 20వ తేదీ వరకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, థియేటర్లు, ఎల్పీజీ గోదాములు, పెట్రోల్ బంక్లు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ స్టాల్ను సీనియర్ లీడింగ్ ఫైర్మెన్లు మస్తానయ్య, హరిబాబు, వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్వో జె.ఉదయ్భాస్కర్రావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు వారోత్సవాల వాల్పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ ఎస్.వేణుగోపాలరావు, అధికారులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.