● జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్
నెల్లూరు(దర్గామిట్ట): ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారులు అందజేసిన అర్జీలను నిర్థిష్ట గడువు లోపు సంతృప్తికరస్థాయిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డీఆర్వో లవన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవిలతో కలిసి జేసీ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ రాకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వచ్చిన అర్జీలే మళ్లీ వస్తున్నాయని, అలాంటి వినతులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏకారణంతో పరిష్కరించలేకపోతున్నామో స్పష్టంగా తెలియజేయాలన్నారు. సోమవారం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో మొత్తం 260 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా, హౌసింగ్, ఐసీడీయస్ పీడీలు రవీంద్ర, నాగరాజు, హేనాసుజన్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, డీఎస్ఓ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి తదితర అధికారులు పాల్గొన్నారు.