మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి
తోటపల్లిగూడూరు : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని కోడూరు బిట్–2 సచివాలయ పరిధిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం మంత్రి చేపట్టారు. పంచాయతీ పరిధిలోని పాతపట్టపుపాళెం, రవీంద్రపురం, రాజీవ్కాలనీ, కొత్తపట్టపుపాళెం, నడిమి పట్టపుపాళెం, ఈదర్లవారిపాళెం, వెంకటేశ్వర పట్టపుపాళెం, కొత్తకోడూరు, ఎద్దలరేవు సంఘం గ్రామల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని, ఈ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలను అందిస్తోందన్నారు. వేట సమయంలో మరణిస్తే గతంలో ఇస్తున్న రూ.5 లక్షలను రూ.10 లక్షలగా పెంచినట్లు పేర్కొన్నారు. వేటకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని పాతపట్టపుపాళేనికి చెందిన మత్స్యకారులు తన దృష్టికి తీసుకురాగా రూ.8 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేత కావల్రెడ్డి రంగారెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్రెడ్డి, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, నాయకులు కావల్రెడ్డి హరిశ్చంద్రారెడ్డి, కె.రవీంద్రరెడ్డి, కె.సురేంద్రనాథ్రెడ్డి, కె.దిలీప్రెడ్డి, డి.శ్రీనివాసులురెడ్డి, ఎం.బుజ్జిరెడ్డి, ఎ.శ్రీనివాసులరెడ్డి, వైస్ ఎంపీపీ నీలమ్మ, మాజీ జెడ్పీటీసీ ఎం.చిరంజీవులగౌడ్ పాల్గొన్నారు.