అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణకు రూ.38 లక్షలు
● ఎస్బీఐ చీఫ్ మేనేజర్ నవీన్చంద్ర
నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్రంలో 34 అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించేందుకు రూ.38 లక్షలు కేటాయించినట్లు ఎస్బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ మేనేజర్ నవీన్చంద్ర తెలిపారు. రంగనాయకులపేట, యాదవవీధిలోని అంగన్వాడీ కేంద్రం ఆధునికీకరణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రానికి ఆర్వో ప్లాంటు, స్మార్ట్ టీవీ, ట్యాబ్లు, కబోర్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మహిళల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తోందన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఏడాది విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ పనులను నెల్లూరు నుంచే లాంఛనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వరదరాజన్, నెల్లూరు రీజనల్ మేనేజర్లు శ్రీనివాసరావు, లక్ష్మి, శేషగిరిరావు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.