గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
పరుగుల వీరులు
ఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.
గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్ను వన్డౌన్లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపింది.
అనూహ్య నిర్ణయం
మూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.
కాగా బట్లర్ను వన్డౌన్లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.
నువ్వు ఇక్కడే కూర్చో..
తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.
ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్డౌన్లో మేము నిశాంత్ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.
వర్కౌట్ కాలేదు
అతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్కతా మ్యాచ్లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.


