
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న బీసీసీఐ ఆశలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నీళ్లు చల్లే సూచనలు కన్పిస్తున్నాయి. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే మూడు సీజన్ల ఫైనల్ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్కే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీనిపై వచ్చే నెలలో సింగపూర్లో జరిగే వార్షిక సమావేశం అనంతరం ఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే 2027, 2029, 2031 ఫైనల్స్కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. 2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లండ్లోని సౌతాంప్టాన్ వేదికగా జరిగింది.
ఆ తర్వాత రెండు సీజన్ల ఫైనల్స్కు లండన్లోని ఓవల్ మైదానం, లార్డ్స్ వేదికలు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఐసీసీ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్కే కట్టబెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గ్లోబల్ బ్రాడ్కాస్టర్స్కు అనువగా ఉండడం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకులు ఎక్కువగా టెస్టు క్రికెట్కు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఆంశాలు ఐసీసీని ప్రభావితం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు విశేష ప్రేక్షక ఆదరణ లభించింది. మొదటి మూడు రోజుల్లో 75,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తమ విజయానికి అంత్యంత చేరువైంది.
చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా