సౌతాఫ్రికా, విండీస్‌ ముందున్నాయి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే! | WI SA Miles Ahead Than Us: Ex India Star On T20 WC Semi Final Hopes | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా, విండీస్‌ ముందున్నాయి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

Feb 25 2026 9:52 PM | Updated on Feb 25 2026 9:52 PM

WI SA Miles Ahead Than Us: Ex India Star On T20 WC Semi Final Hopes

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్‌ సేన చేతులెత్తేసింది.

అతిపెద్ద పరాజయం
సూపర్‌-8 గ్రూప్‌-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్‌లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.

అందనంత ఎత్తులో విండీస్‌
మరోవైపు.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్‌ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్‌ (+5.350)నెట్‌రన్‌రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్‌గా ఉంది.

మరోవైపు భారత్‌ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో.. అదే విధంగా ఆదివారం విండీస్‌తో మ్యాచ్‌లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది.

గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనా
అయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో నెట్‌రన్‌రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్‌లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్‌రన్‌రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.

ఏదేమైనా ఇప్పుడు నెట్‌రన్‌రేటు పరంగా వెస్టిండీస్‌ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్‌లో జింబాబ్వే, వెస్టిండీస్‌ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్‌రన్‌రేటు గురించి ఆలోచించాలి.

ఇంత చెత్తగా ఆడతారా?
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మూడు విభాగాల్లో భారత్‌ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్‌ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. 

ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్‌, సౌతాఫ్రికా నెట్‌రన్‌రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.

చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement