టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్-8 దశలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
ఫలితంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో పాక్ ఓటమికి సల్మాన్ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.
అంతేకాదు.. పాక్ గనుక సెమీస్ చేరకుంటే సల్మాన్తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు.
ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదు
ఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆఘా భార్య సబా మంజర్ ట్రోల్స్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్తో పాటు పాక్ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్కప్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.
సెమీస్లో తొలి అడుగు ఇంగ్లండ్దే
ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 దశ నడుస్తోంది. గ్రూప్-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక బరిలో ఉన్నాయి.
సూపర్-8లో భాగంగా పాక్ తొలుత న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ వచ్చింది.
ఇక ఇంగ్లండ్తో మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్లో శ్రీలంకపై.. తాజాగా పాక్పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్.
చదవండి: NZ vs SL: కివీస్, శ్రీలంకలకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?


