పాక్ జట్టులో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్ను బహిరంగంగా టార్గెట్ చేశాడు. సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెస్సన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
"అవును, నన్ను నమీబియా మ్యాచ్ నుంచి తప్పించారు. అయినా నా దృష్టి ఎప్పటికీ బౌలింగ్పైనే ఉంటుంది. నాకు అవకాశం వచ్చినప్పుడు జట్టుకు 100 శాతం ఇవ్వడమే నా పని. ఎవరి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.
అలాగే హెస్సన్ నిర్ణయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "ఆయనకు ఒక మైండ్సెట్ ఉంది. ఆయన హెడ్ కోచ్. జట్టును ఎలా నడిపించాలో ఆయనకే బాగా తెలుసు. దానికి ఆయనే బాధ్యత వహించాలి" అని వ్యాఖ్యానించారు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు హెస్సన్పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
అఫ్రిది ఎందుకిలా..?
అఫ్రిది-హెస్సన్ మధ్య విభేదాలు ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో నమీబియా మ్యాచ్ నుంచి మొదలయ్యాయి. భారత్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని అఫ్రిదిని హెస్సన్ నమీబియా మ్యాచ్ నుంచి తప్పించాడు. ఈ నిర్ణయాన్ని హెస్సన్ వ్యూహాల్లో భాగంగా పేర్కొన్నప్పటికీ, హెస్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని అఫ్రిది భావిస్తున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అఫ్రిది ఇంగ్లండ్ మ్యాచ్లో రాణించిన తర్వాత హెస్సన్పై పరోక్ష మాటల దాడికి దిగాడు.
ఇంగ్లండ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడినా, అఫ్రిది అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి మ్యాచ్పై ఆశలు కలిగించాడు. అయితే బ్రూక్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ను పాక్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
అంతకుముందు న్యూజిలాండ్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, సెమీస్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు.
ఎందుకంటే, ప్రస్తుతం గ్రూప్-1 నుంచి ఖాళీగా ఉంది ఒకే ఒక బెర్త్. ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి దర్జాగా సెమీస్కు అర్హత సాధించగా.. న్యూజిలాండ్, పాక్, శ్రీలంక మిగిలిన బెర్త్ కోసం పోటీపడుతున్నాయి.


