వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన అత్యంత కీలక ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో .. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా మరణించి ఉండేవారని ట్రంప్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రసంగంలో భాగంగా ట్రంప్ విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ, పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అన్నారు. రెండు అణు దేశాల మధ్య పెను విపత్తును తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. తన పదవీకాలంలోని మొదటి పది నెలల్లోనే థాయ్లాండ్-కాంబోడియా సహా ఎనిమిది యుద్ధాలను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య తలెత్తిన అణు ముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని అన్నారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ఆపరేషన్ గనుక కొనసాగి ఉంటే పాకిస్తాన్లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ భారీ మరణాల అంచనాకు గల ప్రాతిపదికను గానీ, ఆపరేషన్ సిందూర్ నేపధ్యాన్ని గానీ ఆయన వెల్లడించలేదు. చారిత్రక శతృత్వం ఉన్న రెండు అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు అదుపు తప్పి ఉంటే అవి పెను విధ్వంసానికి దారితీసేవని, కానీ తన దౌత్యపరమైన చొరవతో ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నానని ఆయన పునరుద్ఘాటించారు.

దక్షిణాసియాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో తక్షణమే స్పందించడం ద్వారా పెను విషాదాన్ని ఆపగలిగానని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అణు యుద్ధం అంచున ఉన్న ఇరు దేశాలను శాంతి వైపు మళ్లించడంలో అమెరికా అధ్యక్షుడిగా తాను పోషించిన పాత్ర అద్వితీయమని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కాపాడటం వెనుక గల కారణాలను ఆయన ప్రస్తావించనప్పటికీ, అమెరికా జోక్యం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ పాకిస్తాన్ పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్, ఇప్పుడు నేరుగా ఆ దేశ ప్రధాని ప్రాణాలను కాపాడానని ప్రకటించడం ద్వారా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. ఈ పరిణామంపై అటు పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, ఇటు షెహబాజ్ షరీఫ్ కార్యాలయం గానీ ఇప్పటివరకు స్పందించలేదు.


