
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని కలలు కన్న ముంబై ఇండియన్స్(MI)కు నిరాశ మిగిల్చింది. సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి పరిమితమైన ముంబై జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
మరోవైపు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫయర్-1 ఆడేందుకు శ్రేయస్ సేన అర్హత సాధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ యూనిట్గా మరింత మెరుగ్గా రాణించి ఉండాల్సందని పాండ్యా అభిప్రాయపడ్డాడు.
"జైపూర్ పిచ్ బ్యాటింగ్కు అద్బుతంగా ఉంది. ఈ పిచ్ను బట్టి చూస్తే కనీసం 20 పరుగులు తక్కువ చేశామని అన్పించింది. అయితే గత కొన్ని మ్యాచ్లుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాము. ఈ మ్యాచ్లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.
ఈ ఓటమి మాకు నష్టం కలిగించింది. ముంబై ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. అయినప్పటికి ప్రతీ మ్యాచ్ కూడా సవాలుతో కూడుకున్నది. ఒక్కసారి మన స్పీడ్ను తగ్గిస్తే ప్రత్యర్ధి దాన్ని ఉపయోగించుకుని విజయాలు సాధిస్తారు.
మా బాయ్స్కు నేను చెప్పేది ఒక్కటే. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని నాకౌట్ దశ కోసం సిద్ధంగా ఉండాలి. ఏదేమైనప్పటికి బ్యాటింగ్ యూనిట్గా మేము కచ్చితంగా 20 పరుగులు వెనకబడ్డాము. తప్పు ఎక్కడ జరిగిందో మా డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటాము.
మా తర్వాతి మ్యాచ్లో ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ పిచ్పై లెగ్ స్పిన్నర్, పేసర్ కాంబినేషన్ పని చేస్తుందనే భావించాము. అందుకే అదనంగా ఆఫ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ బదులుగా పేసర్ అశ్వినీ కుమార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నాము.
కానీ ఫలితం మేము ఆశించినట్లు రాలేదు. మేము అశ్వినీ కుమార్ సపోర్ట్ చేస్తున్నాము. సీజన్ అంతటా మాది అదే ప్రణాళిక. సెకెండ్ హాఫ్లో కూడా పిచ్ ఏ మాత్రం మారలేదు. పంజాబ్ మా కంటే మెరుగ్గా ఆడారు. ముఖ్యంగా ఆ ఇద్దరు(ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిష్) రెండో వికెట్కు అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు.
మా బౌలర్లు లైన్ తప్పిన ప్రతీసారి వారిద్దరూ బంతులను స్టాండ్స్కు పంపిచారు. బౌలింగ్ యూనిట్గా అంత గొప్పగా మేము బౌలింగ్ చేయలేకపోయాము. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ లోకి వెళ్తున్నాము.. అక్కడ మంచి బ్యాటింగ్, బౌలింగ్ తో కూడా అద్భుత ప్రదర్శన చేయాల్సిన అవసరముంది అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు.
కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే చేధించింది. జోష్ ఇంగ్లిష్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..