ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఘోర ఓటమి చవిచూసింది. శనివారం జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడులేకపోయారు.
అంతేకాకుండా కెప్టెన్ రియాన్ పరాగ్ తల తిక్క నిర్ణయాలు కూడా రాజస్తాన్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో టాప్ క్లాస్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాలతో పరాగ్ చెరో ఓవర్ మాత్రమే వేయించాడు. భారీగా పరుగులు సమర్పించుకున్న బ్రిజేష్ శర్మతో మాత్రం పరాగ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు.
కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా రియాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పరాగ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన పరాగ్ కేవలం 88 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 20 పరుగులగా ఉంది. ఈ నేపథ్యంలో పరాగ్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.
"రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్ కెప్టెన్సీపై పునరాలోచన చేయాలి. అతడు తమకు సరైన కెప్టెన్ కాదా అన్నది రాజస్తాన్ మరోసారి ఆలోచించాలి. మీరు 25 మందినీ ఇంటర్వ్యూ చేసి పరాగ్ను ఎంపిక చేసి ఉండొచ్చు. కానీ అతడు లీడర్గా నిరూపించుకోలేకపోతున్నాడు.
ముఖ్యంగా అతడి వ్యూహాలు ఎంటో ఆర్ధం కావడం లేదు. హైదరాబాద్తో మ్యాచ్లో వికెట్ టేకింగ్ బౌలర్లైన రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాలతో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. వారికి మరో ఓవర్ ఇచ్చి ఉండాల్సింది. ఒక్క ఓవర్ మాత్రమే ఇస్తే వికెట్లు ఏలా తీస్తారు? అతడు బ్యాటర్గా కూడా విఫలమవుతున్నాడు.
ఆ ప్రభావం కచ్చితంగా అతడి కెప్టెన్సీపై పడుతుంది. పరుగులు ఎలా సాధించాలన్న తపనతో కెప్టెన్సీపై ఏకాగ్రతను కోల్పోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం బాదేశాడు, నేను సీనియర్ని, ఎందుకు పరుగులు చేయలేకపోతున్నాను అని పరాగ్ తెగ ఆలోచిస్తుంటాడు. పదేపదే ఎక్కువగా ఆలోచించడంతో అతడిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని" క్రిక్బజ్ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్?


