రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో వైభవ్కు చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలో సూర్యవంశీ డెబ్యూ చేస్తాడని భావించారు.
కానీ టీమ్ మేనెజ్మెంట్ మాత్రం రెండు మ్యాచ్లలోనూ అతడికి తుది జట్టులో అవకాశమివ్వలేదు. సీనియర్ ప్లేయర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను ఓపెనర్లగా కొనసాగించింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లోనూ వైభవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు.
ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్పై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ సిరీస్లో సూర్యవంశీ కి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆడాల్సింది. బెల్ఫాస్ట్ పిచ్ స్లో అండ్ స్పాంజీ ట్రాక్. మైదానం కూడా చాలా చిన్నది. వైభవ్ గనక ఆడి ఉంటే బంతులను స్టేడియం బయటకు పంపేవాడు. తన బ్యాటింగ్తో వాళ్ల ప్యాంట్లు ఊడదీసేవాడు. అతడి ఆడి ఉంటి బాగుండేది. ఇంగ్లండ్ టూర్లో కూడా అతడిని ఆడిస్తారో లేదో స్పష్టత లేదు.
వైభవ్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్. సూర్యవంశీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడికి కేవలం 15 ఏళ్లే. మైదానంలోకి వెళ్లి చెలరేగిపోవడమే అతడికి తెలుసు. వైభవ్ జట్టులో ఉంటే కచ్చితంగా పవర్ప్లేలో పరుగులు సాధిస్తాడు. అతడికి వీలైనంత త్వరగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించాలి" అని ఇంగ్లండ్తో తొలి టీ20 ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్లో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక


