సెంచరీ పూర్తి చేసిన స్మృతి మంధన | Tri Nation Series, INDW VS SLW: Smriti Mandhana Makes His 100th Appearance In ODIs | Sakshi
Sakshi News home page

సెంచరీ పూర్తి చేసిన స్మృతి మంధన

May 4 2025 12:16 PM | Updated on May 4 2025 12:53 PM

Tri Nation Series, INDW VS SLW: Smriti Mandhana Makes His 100th Appearance In ODIs

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన వన్డేల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్‌తో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధన భారత్‌ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్‌గా నిలిచింది. ఆమెకు ముందు మిథాలీ రాజ్‌ (232), జులన్‌ గోస్వామి (204), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (144), అంజుమ్‌ చోప్రా (127), అమిత శర్మ (116), దీప్తి శర్మ (104) ఈ ఘనత సాధించారు.

మంధన భారత్‌ తరఫున 100 ఇన్నింగ్స్‌ల్లో 45.81 సగటున 10 సెంచరీలు, 30 అర్ద సెంచరీల సాయంతో 4306 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధన రికార్డుల్లో ఉంది. వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో బెలిండ క్లార్క్‌ (4556), మెగ్‌ లాన్నింగ్‌ (4463) మంధన కంటే ముందు ఉన్నారు.

శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మంధన 28 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ 31 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మంధన 18, ప్రతిక రావల్‌ 35, హర్లీన్‌ డియోల్‌ 29, హర్మన్‌ప్రీత్‌ 30 పరుగులు చేసి ఔట్‌ కాగా.. జెమీమా రోడ్రిగెజ్‌ 28, రిచా ఘోష్‌ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో సుగంధిక కుమారి, దేవ్మీ విహంగ, ఇనోకా రణవీర తలో వికెట్‌ తీశారు.

శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మే 2న జరిగిన మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై శ్రీలంక 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement