టీజీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్ లో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్.. వరంగల్ వారియర్స్పై 161 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 253 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 91 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అమన్రావు (31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
వరంగల్ బౌలర్లలో నితిన్ సాయి యాదవ్, హితేశ్ యాదవ్లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (43 బంతుల్లో 91, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, ఆదిత్య జవ్వాజి (36 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇద్దరు మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 71 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. చివర్లో వెంకట్ కార్తిక్ (26 బంతుల్లో 51 నాటౌట్) సంచలన హాఫ్ సెంచరీతో మెరిశాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో సల్మాన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా, ముద్దసర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు.


